ప్రియా మాలిక్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ సాధించిందని తప్పులో కాలేసిన టీమిండియా క్రికెటర్లు

25 Jul, 2021 16:46 IST|Sakshi

డ‌ర్హ‌మ్‌: విశ్వక్రీడా సంబురం(టోక్యో ఒలింపిక్స్) జ‌రుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్క‌డ ఏ మెడ‌ల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్‌లోనే అనుకుని చాలా మంది ప్రముఖులు పొరబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌తో పాటు హంగేరీలోని బుడాపెస్ట్‌లో వ‌ర‌ల్డ్ క్యాడెట్‌ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం భారత రెజ్ల‌ర్ ప్రియా మాలిక్ వ‌ర‌ల్డ్ క్యాడెట్‌ రెజ్లింగ్ ఛాంపియ‌న్‌షిప్‌ పోటీల్లో గోల్డ్ మెడ‌ల్ సాధించింది.

అయితే ఆమె ఒలింపిక్స్‌లోనే ఆ మెడ‌ల్ గెలిచింద‌నుకొని టీమిండియా క్రికెటర్లు ఇషాంత్‌ శర్మ, హనుమ విహారిలు.. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. వీరిలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ప్రియా మాలిక్‌ ఒలింపిక్స్‌లోనే మెడ‌ల్ గెలిచింద‌నుకొని శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ప్రారంభించారు. దీంతో ట్విట‌ర్‌లో #NotOlympics ట్రెండింగ్ అయ్యింది. కాగా, ఈ విష‌యం తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెంట‌నే త‌మతమ ట్వీట్లు డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఇషాంత్.. చానుకు శుభాకాంక్ష‌లు తెలిపాడు.
 

>
మరిన్ని వార్తలు