Asia Cup 2022 Ind Vs Pak: 'పంత్‌ను కాదని కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయం'

30 Aug, 2022 11:02 IST|Sakshi

ఆసియా కప్‌ 2022ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది జట్టు పాకిస్తాన్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు జట్టు మేనేజేమెంట్‌ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌కు తుది జట్టులో ఫామ్‌లో ఉన్న పంత్‌ను కాదని ఆనూహ్యంగా దినేష్‌ కార్తీక్‌ వైపు జట్టు మేనేజేమెంట్‌ మొగ్గు చూపింది.

అయితే ఈ నిర్ణయంపై ప్రస్తుతం భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొం‍తమంది తప్పుబడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు పంత్‌ను కాదని దినేష్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమని హర్భజన్ తెలిపాడు.

డీకే సరైనోడు..
"రిషబ్‌ పంత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అతడు కేవలం టెస్టులు, వన్డేల్లో మాత్రమే రాణిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో మాత్రం పంత్‌ అంతగా ఆకట్టు కోలేకపోయాడు. మరోవైపు దినేష్‌ కార్తీక్‌ ఈ పొట్టి ఫార్మాట్‌లో గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయకూడదు. కాబట్టి పంత్‌ను కాదని కార్తీక్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడం సరైన నిర్ణయం.

రిషబ్‌ పంత్‌ యువ ఆటగాడు. అతడికి ఇంకా చాలా సమయం ఉంది. కార్తీక్‌ మరో ఒకటి రెండేళ్లు మాత్రమే క్రికెట్‌ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జట్టులో ఉన్నప్పడే అతడిని సద్వినియోగం చేసుకోవాలి. అతడు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు. లోయర్‌ ఆర్డర్‌లో కూడా అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 

హార్దిక్ పాండ్యా,  దినేష్ కార్తీక్ వంటి ఫినిషర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది" అని హార్భజన్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క  బంతి మాత్రమే ఆడిన కార్తీక్‌ హార్దిక్‌ స్ట్రైక్‌ ఇచ్చాడు.. అయితే ఫీల్డింగ్‌లో మాత్రం వికెట్ల వెనుక మూడు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు.

చదవండి: Harbhajan Singh explains why Dinesh Karthik played ahead of Rishabh Pant vs Pak

మరిన్ని వార్తలు