ENG Vs IND 5th Test: 'ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. ఆ ఆల్‌రౌండర్‌ భారత జట్టులో ఉండాల్సింది'

30 Jun, 2022 10:57 IST|Sakshi

ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టుకు టీమిండియా జట్టులోకి ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసి ఉండాల్సిందని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టెస్టు జట్టులో శార్దూల్ ఠాకూర్ బాగా రాణిస్తున్నప్పటికీ.. హార్దిక్‌ లాంటి ఆల్‌ రౌండర్‌ జట్టులో ఉంటే మరింత బలం చేకూరుతుందని హర్భజన్ తెలిపాడు.

ఇక పాండ్యా గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ అదరగొట్టిన పాండ్యా.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ రాణించాడు. ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా.. 487 పరుగులు సాధించాడు. "ఇంగ్లండ్‌తో టెస్టుకు భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఉండాల్సింది. ఇంగ్లండ్‌ వంటి పిచ్‌లపై పేసర్లు బాగా రాణిస్తారని తెలుసు.

శార్దూల్ ఠాకూర్ గత కొంత కాలంగా బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. కానీ హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌ రౌండర్‌ ఉంటే జట్టు బ్యాటింగ్‌ పరంగా దృఢంగా ఉంటుంది. అదే విధంగా అతడు పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా కూడా ఉపయోగపడతాడు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక హార్ధిక్‌ పాండ్యా తన చివరి టెస్టు మ్యాచ్‌ 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు. అనంతరం కేవలం వైట్‌ బాల్‌ సిరీస్‌లకే హార్దిక్‌ పరిమితమయ్యాడు.
చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

మరిన్ని వార్తలు