హార్ధిక్‌పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ వ్యాఖ్యాత

30 Mar, 2021 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన అర్ధశతకం(44 బంతుల్లో 64) సాధించి, ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల కాలంలో హార్ధిక్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్‌ చేస్తున్నాడని, అతన్ని బ్యాటింగ్‌ ఆర్ఢర్‌లో ప్రమోట్‌ చేస్తే సెంచరీలు సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. హార్ధిక్‌ బంతిని అద్భుతంగా మిడిల్‌ చేస్తున్నాడని, దాంతో పాటు ప్రొఫెషనల్‌ క్రికెటింగ్‌ షాట్లు ఆడుతున్నాడని ఆయన కితాబునిచ్చాడు. హార్ధిక్‌ తన బ్యాటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకున్నాడని ఆయన చమత్కరించాడు.

27 ఏళ్ల హార్ధిక్‌ వన్డేల్లో 7 అర్ధసెంచరీలు సాధించినప్పటికీ, కెరీర్‌లో సెంచరీ మైలురాయి మాత్రం అతన్ని ఊరిస్తూనే ఉంది. వన్డే కెరీర్‌లో అతని అత్యుత్తమ స్కోర్‌ 90 పరుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా.. హార్ధిక్‌ సెంచరీ సాధించడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, ఆదివారం పూణే వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 329 పరుగలకు ఆలౌట్‌ కాగా, ఛేదనలో తడబడ్డ ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ నవయువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌(83 బంతుల్లో 95; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చాడు.
చదవండి: ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా..

మరిన్ని వార్తలు