Hardik Pandya: భారత్‌కు తిరిగి వస్తూ పాండ్యా ఏం చేశాడంటే!

26 Nov, 2022 21:48 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ ఫీల్డ్‌లో చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు పాండ్యా అంటే ఫైర్‌బ్రాండ్‌కు పెట్టింది పేరు. మైదానంలో బరిలోకి దిగాడంటే దూకుడైన ఆటతీరుతో అగ్రెసివ్‌నెస్‌ కనబడేవాడు. కానీ ఎప్పుడైతే గాయంతో ఆటకు దూరమయ్యాడో అప్పటి నుంచి పాండ్యా పూర్తిగా మారిపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. డెబ్యూ సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ కొట్టడంలో కెప్టెన్‌గా.. ఆటగాడిగా పాండ్యాదే కీలకపాత్ర. ఐపీఎల్‌ మొత్తంగా పరిణితితో కూడిన పాండ్యానే కనిపించాడు. ఆ తర్వాత టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా అదే నిలకడను కొనసాగిస్తున్నాడు.

టి20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వచ్చింది. రోహిత్‌ గైర్హాజరీలో టి20 కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా టీమిండియాకు సిరీస్‌ విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ధావన్‌ నేతృత్వంలో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఇప్పటికే తొలి వన్డే ఓడిన టీమిండియా ఆదివారం రెండో వన్డే ఆడనుంది. ఇక వన్డే సిరీస్‌కు పాండ్యాను ఎంపిక చేయలేదు. దీంతో స్వదేశానికి బయలుదేరిన పాండ్యా తన చర్యతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు.

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా ప్రయాణం చేసిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్న వ్యక్తికి పాండ్యా తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేకాదు ఆ జెర్సీపై పాండ్యాతో పాటు ఇతర క్రికెటర్ల సంతకాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోనూ సదరు బస్‌ డ్రైవర్‌ షేర్‌ చేసుకున్నాడు. పాండ్యా ప్రేమతో ఇచ్చిన జెర్సీని తాను వేలం వేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. 

చదవండి: మెస్సీపై అభిమానం దేశాలను దాటించింది

మరిన్ని వార్తలు