IPL 2023: వారిద్దరూ అద్భుతం.. క్రెడిట్‌ వారికే ఇవ్వాలి! అది మాత్రం చాలా కష్టం

1 Apr, 2023 10:56 IST|Sakshi
PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ శుభారంభం చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్‌.. 5వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

గుజరాత్‌ విజయంలో శుబ్‌మన్‌ గిల్‌(63), రషీద్‌ ఖాన్‌( 3బంతుల్లో 10) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శన కనబరిచిన రషీద్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ధి మ్యాచ్‌ అవార్డు లభిచింది. ఇక ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు.

వారిద్దరూ అద్భుతం..
హార్దిక్‌ మాట్లాడుతూ.. "తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు అద్భుతమైన శుభారంభం. కాగా ఛేజింగ్‌లో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పో‍యి క్లిష్ట పరిస్థితిలో పడ్డాము. ఇటువంటి సమయంలో రషీద్‌, రాహుల్ తెవాటియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

కాబట్టి విన్నింగ్‌ క్రెడిట్‌ వీరిద్దరికి ఇవ్వాలి అనుకుంటునున్నాను. శుబ్‌మన్‌ కూడా సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలుత సీఎస్‌కే ఓ దశలో 200 పైగా పరుగులు సాధిస్తుందని నేను భావించాను. కానీ మిడ్‌ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.

రెండు కీలక వికెట్లు పడగొట్టి సీస్‌ఎస్‌కే జోరుకు అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా రుత్‌రాజ్‌ వికెట్‌ మాకు చాలా కీలకం. అదే విధంగా రషీద్‌ ఖాన్‌ మాకు దొరికిన నిజమైన ఆస్తి. అతడు మాకు రెండు కీలక వికెట్లు అందించాడు. బ్యాటింగ్‌లో కూడా రషీద్‌ అదరగొట్టాడు. ఇక  జోషఫ్‌ కూడా ఆఖరిలో  అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

కానీ ఈ మ్యాచ్‌లో నేను, గిల్‌ అనవసర షాట్‌ ఆడి వికెట్లు కోల్పోయాము. అదే విధంగా ఇంపాక్ల్‌ ప్లేయర్‌ రూల్‌ను ఉపయోగించుకోవడం చాలా కష్టం. మా దగ్గర చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఉపయోగించుకోవాలో నిర్ణయించడం చాలా కష్టమవుతుంది" అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!

మరిన్ని వార్తలు