IPL Auction: నమ్మకద్రోహం చేశారు.. మోసపోయాను.. కానీ: హర్షల్‌ పటేల్‌

26 Apr, 2022 17:17 IST|Sakshi
హర్షల్‌ పటేల్‌(PC: IPL/BCCI)

IPL 2022 RCB Player Harshal Patel: హర్షల్‌ పటేల్‌.. ఐపీఎల్‌-2012లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. 2015 సీజన్‌లో 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2018-2020 మధ్య ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం మళ్లీ ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్‌ 2021 ఎడిషన్‌లో 32 వికెట్లు కూల్చి పర్పుల్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. 

జట్టును ప్లే ఆఫ్స్‌ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతేగాక టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రిటెన్షన్‌ సమయంలో ఆర్సీబీ అనూహ్యంగా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలం-2022లోకి రాగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. 

ఈ విషయం గురించి హర్షల్‌ తాజాగా బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘2018 వేలం జరుగుతున్న సమయంలో.. నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురు చూశాను.. నిజానికి అప్పుడు నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ఆడే అవకాశం దక్కితే చాలనుకున్నా.

అంతకుముందే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన ఓ ముగ్గురు నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎవరూ ఆ పని చేయలేదు. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నమ్మకద్రోహానికి గురైనట్లు, మోసానికి గురయ్యానన్న భావన మనసును మెలిపెట్టింది.

కొన్ని రోజుల పాటు దాని గురించే ఆలోచించాను. చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత ఆటపై మాత్రమే దృష్టి సారించి ముందుకు సాగాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేలం-2022లో ఆర్సీబీ తనను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత విరాట్‌ కోహ్లి సంతోషంగా తనకు మెసేజ్‌ చేశాడన్న హర్షల్‌ పటేల్‌.. తనకు నిజంగానే లాటరీ తగిలిందని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు.

చదవండి👉🏾RCB Vs RR: మొన్న 68 పరుగులకే ఆలౌట్‌.. అక్కడేమో అత్యల్ప స్కోరు 73..!

Poll
Loading...
మరిన్ని వార్తలు