రెజ్లర్‌ రవి దహియాకు భారీ నజరానా.. క్లాస్ 1 కేటగిరీ ఉద్యోగం..!

5 Aug, 2021 18:57 IST|Sakshi

చండిగఢ్‌: టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్‌ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఒలింసిక్స్‌లో రజతం సాధించిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన రవి దహియాకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే క్లాస్‌-1 కేటగిరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రవి దహియా అడిగిన చోట 50శాతం రాయితీతో  ఓ ఫ్లాట్‌ స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.  దహియా పుట్టి పెరిగిన తన స్వగ్రామం నహ్రిలో.. రెజ్లింగ్‌ కోసం ప్రత్యేకంగా ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించింది.

కాగా ఫైనల్‌లో రష్యా రెజ్లర్‌ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన దహియా 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో సుశీల్‌ కుమార్‌ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులు ట్విటర్‌ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దహియా పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌ రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది.

ఇక సుశీల్‌ కుమార్‌ 2012 లండన్ గేమ్స్‌లో రజతం గెలుచుకోగా.. అక్కడ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్‌లో సుశీల్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేకాకుండా జాదవ్ 1952 హెల్సింకి గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. 2016 రియో ​​ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు