2003 తర్వాత.... ఇదే తొలిసారి

9 Feb, 2021 06:17 IST|Sakshi

దక్షిణాఫ్రికాపై సిరీస్‌ నెగ్గిన పాకిస్తాన్‌

రెండో టెస్టులో 95 పరుగులతో ఓడిన సఫారీలు

రావల్పిండి: తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన పేసర్‌ హసన్‌ అలీ (5/60) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్‌ 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ విజయాన్ని సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ 95 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాపై గెలుపొంది సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సఫారీలపై పాక్‌ చివరగా 2003లో సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–0తో దక్కించుకుంది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 370 పరుగుల లక్ష్యఛేదనలో సోమవారం దక్షిణాఫ్రికా అనూహ్యంగా తడబడింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 127/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 274 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ మార్క్‌రమ్‌ (108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా... తెంబా బవుమా (61; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టును 241/3తో పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ దశలో పేసర్లు హసన్‌ అలీ, షహీన్‌ అఫ్రిది (4/51) విజృంభించడంతో దక్షిణాఫ్రికా మరో 33 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 10 వికెట్లు దక్కించుకున్న హసన్‌ అలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రిజ్వాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.

మరిన్ని వార్తలు