అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట

18 Aug, 2021 03:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు కె.జాన్‌ మనోజ్‌తోపాటు పలువురు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ వర్మ గత నెల జూలై 4న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఈ పిటిషన్‌ సింగిల్‌ జడ్జి ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటివరకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై అజారుద్దీన్‌ ధర్మాసనాన్ని ఆశ్రయించారు.  

మరిన్ని వార్తలు