'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు'

11 May, 2021 16:21 IST|Sakshi

ముంబై: ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ను దక్కించుకునే అవకాశాలు టీమిండియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందని.. కివీస్‌ కంటే బలంగా కనిపిస్తుందని చెప్పాడు.

స్టార్‌స్పోర్ట్ష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్థివ్‌ పటేల్‌ మాట్లాడుతూ.. '' రాబోయే ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియానే బలంగా కనిపిస్తుంది. కివీస్‌తో పోల్చుకొని చూస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. బీసీసీఐ 20 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించినప్పుడే విజయం మనదే అని తెలిసింది. వీరికి తోడు నలుగురు స్టాండ్‌ బై ప్లేయర్లను కూడా ఎంపికచేశారు. బౌలింగ్‌ విషయానికి వస్తే బుమ్రా, ఇషాంత్‌ శర్మ, షమీలతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈ త్రయం 11 మ్యాచ్‌లు కలిపి 149 వికెట్లు తీశారు. ఇక పేస్‌ విభాగానికి అండగా సిరాజ్‌, ఉమేశ్‌ రూపంలో బెంచ్‌ బలం కూడా పటిష్టంగా కనిపిస్తుంది.

ఇక బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌, గిల్‌, కోహ్లి, రహానే, పుజారా, పంత్‌తో బ్యాటింగ్‌ విభాగం బలంగా కనిపిస్తుండగా.. కేఎల్‌ రాహుల్‌ కూడా వారికి జత కలిస్తే ఇక బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఆల్‌రౌండర్‌ కోటాలో చూసుకుంటే అశ్విన్‌, జడేజా రూపంలో ఇద్దరు ఉన్నారు. వీరికి తోడూ అక్షర్‌ పటేల్‌ కూడా ఉన్నాడు. అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జడేజా దూరమవడంతో అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. అక్షర్‌ వచ్చీ రావడంతోనే 23 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడు జడేజా తుది జట్టులోకి వచ్చాడు.. అక్షర్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే.. అయినా మంచి జట్టుతో మ్యాచ్‌ను గెలవడం అవసరం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా కివీస్‌, భారత్‌ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
చదవండి: ఇండియా గురించే ఆలోచిస్తున్నా

‘ధోని కోసం పంత్‌తో కలిసి ప్లాన్‌ చేశా’

మరిన్ని వార్తలు