పంత్‌,ఇంగ్లండ్‌ కీపర్‌ గొడవ.. మధ్యలో స్టోక్స్‌

14 Feb, 2021 14:26 IST|Sakshi

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో పంత్‌, స్టోక్స్‌ మధ్య చిన్పపాటి గొడవ జరిగింది. ఇన్నింగ్స్‌ 87వ ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బౌలింగ్‌కు వచ్చిన సమయంలో పంత్‌ బ్యాటింగ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ పదే పదే వికెట్ల వెనుక నుంచి నోరుజారుతూ కనిపించాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన పంత్‌ నిరసన వ్యక్తం చేస్తూ స్ట్రైక్ తీసుకునేందుకు నిరాకరించి బెన్‌ ఫోక్స్‌ వైపు చూస్తూ నిలబడ్డాడు. దాంతో.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని పంత్‌కి సర్దిచెప్పాడు.

ఓవర్ ముగిసిన తర్వాత కెప్టెన్‌ రూట్‌ పంత్ వద్దకి వచ్చి సర్ది చెప్తున్నాడు.. ఇంతలో అక్కడికి చేరుకున్న బెన్‌ స్టోక్స్ పంత్‌ను రెచ్చగొట్టే ధోరణిలో వాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి పంత్, స్టోక్స్ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. స్టోక్స్‌ తీరుచూస్తే పంత్‌తో కావాలనే గొడవ పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. మరోసారి ఫీల్డ్‌ అంపైర్లు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ధి చెప్పారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రిషబ్‌ పంత్‌ 58 నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అశ్విన్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్‌ పటేల్‌ 2, సిరాజ్‌, ఇషాంత్‌లు చెరో వికెట్‌ తీశారు.
చదవండి: పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్‌లో డౌటే!

మరిన్ని వార్తలు