సుందర్‌, బెయిర్‌ స్టో గొడవ.. అంపైర్‌ జోక్యం

13 Mar, 2021 08:36 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టోల మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ ఆఖరి బంతిని క్రీజులో ఉన్న డేవిడ్‌ మలాన్‌ బెయిర్‌ స్టో ఉన్న వైపు షాట్‌ ఆడాడు. అయితే బెయిర్‌ స్టో అప్పటికే క్రీజు నుంచి బయటకు వచ్చేశాడు. కాట్‌ అండ్‌ బౌల్డ్‌కు అవకాశం ఉండడంతో సుందర్‌ కూడా బెయిర్‌ స్టో ఉన్న వైపు పరిగెత్తుకొచ్చాడు. బంతిని అందుకునే క్రమంలో సుందర్‌ బెయిర్‌ స్టోపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతి బెయిర్‌ స్టో హెల్మెట్‌కు తాకి పక్కకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన సుందర్‌ బెయిర్‌ స్టో వైపు కోపంగా చూశాడు. అదే సమయంలో నేనేం చేశానన్నట్టుగా బోయిర్‌ స్టో ఏదో అనడంతో సుందర్‌ కూడా కౌంటర్‌ ఇచ్చాడు. అలా కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో ఫీల్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారిద్దరిని విడదీసి పక్కకు పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కాగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌ జట్టు శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రెయాస్‌ అయ్యర్‌ (67 పరుగులు) మినహా ఎవరు ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే చేధించింది. జేసన్‌ రాయ్‌ 49 పరుగులతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీసినందుకుగాను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం(మార్చి 14న) ఇదే వేదికలో జరగనుంది.
చదవండి:
ఐదేళ్ల తర్వాత క్రికెటర్ రీఎంట్రీ‌‌

మరిన్ని వార్తలు