ENG-W vs IND-W: ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం!

19 Aug, 2022 18:44 IST|Sakshi

ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మహిళలతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ దూరం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన నైట్‌.. ప్రస్తుతం తన తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకుంది.

దీంతో ఆమె కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరగనున్న సిరీస్‌కు, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌కు నైట్‌ దూరం కానుంది. కాగా ఆమె ఈ గాయం కారణంగానే కామన్వెల్త్ గేమ్స్‌-2022, ది హండ్రెడ్ సీజన్‌ నుంచి తప్పుకుంది.


ఇక ఇదే విషయాన్ని నైట్ కూడా దృవీకరించింది. "నేను నా తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకున్నాను. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మైదానంలో పరిగెత్తడానికి సిద్దమవుతాను. అయితే దురదృష్టవశాత్తూ ఈ గాయం నన్ను భారత్‌ సిరీస్‌, మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగం కాకుండా చేసింది. కానీ ఈ ఏడాది అఖరి నాటికి తిరిగి జట్టులోకి రావాలని  లక్ష్యంగా పెట్టుకున్నాను" నైట్ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొం‍ది.

భారత్‌తో జరిగే సిరీస్‌కు నైట్‌ స్థానంలో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ స్కైవర్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమెనే ఇంగ్లండ్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తించింది. కాగా ఇంగ్లండ్‌ పర్యటలో భాగంగా భారత్‌ మూడు టీ20లు మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 10న  చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది.
చదవండి: ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు!

మరిన్ని వార్తలు