ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ను కాదని విహారి ఎందుకు..? 

3 Jan, 2022 16:39 IST|Sakshi

వాండరర్స్‌: దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెన్నునొప్పి కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో తాత్కాలిక సారధిగా కేఎల్‌ రాహుల్‌ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు యాజమాన్యం కోహ్లి స్థానాన్ని ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌తో కాకుండా హనుమ విహారితో భర్తీ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తున్న వేళ బీసీసీఐ ఈ విషయమై​ క్లారిటీ ఇచ్చాడు. 

మ్యాచ్‌ ఆరంభానికి ముందు రోజు అయ్యర్‌.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే రెండో టెస్ట్‌ సెలక్షన్‌కి అతను అందుబాటులో లేడని వివరించింది. దీంతో విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న విహారి.. కోహ్లి స్థానాన్ని భర్తీ చేశాడని పేర్కొంది. 

కాగా, విహారి.. సరిగ్గా ఏడాది తర్వాత అనూహ్యంగా తిరిగి జట్టులోకి రావడం విశేషం. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో(జనవరిలో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో) విహారి చివరిసారి టీమిండియా తరఫున ఆడాడు. మరోవైపు అరంగేట్రం టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అయ్యర్‌.. మరో అవకాశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రోజు లంచ్‌ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. పుజారా(3), రహానే(0)లు వైఫల్యాల పరంపరను కొనసాగించగా.. మయాంక్‌(37 బంతుల్లో 26; 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించినా నిలదొక్కుకునే సమయంలో అవుటయ్యాడు. క్రీజ్‌లో రాహుల్‌(74 బంతుల్లో 19; 4 ఫోర్లు), విహారి(12 బంతుల్లో 4) ఉన్నారు. సఫారీ బౌలర్లలో ఒలివర్‌ 2, జన్సెన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.
చదవండి: రానున్న దశాబ్ద కాలం రాహుల్‌దే.. కెప్టెన్‌గా అతనికి తిరుగుండదు..!

>
మరిన్ని వార్తలు