Neeraj Chopra-Rajinikanth: నీరజ్ చోప్రా కోసం మొత్తం ఖర్చెంతో తెలుసా?

9 Aug, 2021 13:27 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్రా 450 రోజుల పాటు జావెలిన్‌ త్రో కోసం విదేశాల్లో శిక్షణ పొందాడు. ఈ శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చోప్రా ప్రస్తుత ఒలింపిక్స్ కోసం  26 పోటీలలో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికా, పోలాండ్, టర్కీ, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్  స్వీడన్‌ వంటి దేశాల్లో విదేశీ  శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నాడు.

తొలుత 2017లో  నీరజ్‌ చోప్రా కోచ్‌గా జావెలిన్ త్రో లెజెండ్ ఉవే హోన్ బాధ్యతలు స్వీకరించగా.. 2019లో చోప్రా మోచేతి శస్త్రచికిత్స తర్వాత ఆయన కోచ్‌గా డాక్టర్‌ క్లాస్ బార్టోనియెడ్జ్ నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం రూ.1.22 కోట్లు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావలిన్లకు రూ. 4,35,000 ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు నీరజ్ యూరప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు 50 రోజులపాటు స్వీడన్‌లో ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.19.22 లక్షలు ఖర్చు చేసింది. ఇందుకు ప్రతిఫలంగా నీరజ్‌ చోప్రా దేశానికి స్వర్ణపతకం అందించి వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు.

>
మరిన్ని వార్తలు