The Hundred League 2022: బాబర్ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లకు ఘోర అవమానం.!

6 Apr, 2022 17:42 IST|Sakshi

లండన్: ఐపీఎల్‌కు పోటీగా ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌ స్టార్‌ బ్యాటర్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లకు ఘోర అవమానం జరిగింది. ఈ నెల 5న జరిగిన లీగ్‌ మెగా వేలంలో రూ. 1.25 కోట్ల రిజర్వ్ ప్రైస్ విభాగంగా పోటీపడిన ఈ ఇద్దరు బ్యాటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ పాక్‌ ద్వయం అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ తాజాగా జరిగిన ఆసీస్‌ సిరీస్‌లో సెంచరీల మోత మోగించి పరుగుల వరద పారించినప్పటికీ అతనిపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా కొనసాగుతున్న పాక్‌ కెప్టెన్‌ను వంద బంతుల ఫార్మాట్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడాన్ని పాక్‌ మాజీలు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబర్‌ ఆజమ్‌ను టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో పోల్చుకునే పాక్‌ అభిమానులకు ఇది చెంపపెట్టు లాంటింది. ఐపీఎల్ వేలంలోకి తమ కెప్టెన్ పాల్గొంటే కనీసం రూ.20 కోట్లు దక్కేవి అని బడాయికి పోయిన ఆ దేశ మాజీలు ఈ పరిణామంలో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాక ముఖం చాటేస్తున్నారు. బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌లతో పాటు హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా చుక్కెదురైంది. 

వార్నర్‌ను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. అయితే వంద బంతుల లీగ్‌లో ఐపీఎల్‌ ఆటగాళ్లను మాత్రం భలే డిమాండ్‌ ఉండింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయారు. కీరన్ పొల్లార్డ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్క్‌ వుడ్, జోస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, మార్కస్ స్టొయినిస్, రషీద్ ఖాన్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టొన్, ఆడమ్ మిల్నే లాంటి ఐపీఎల్‌ స్టార్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. కాగా, వంద బంతుల ఫార్మాట్‌లో సాగే హండ్రెడ్‌ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: హండ్రెడ్‌ లీగ్‌లో ఐపీఎల్‌ స్టార్లు, ఇక్కడేమో కోట్లు కుమ్మరించారు.. అక్కడేమో..!

మరిన్ని వార్తలు