Glenn McGrath: ఆ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉంది..!

2 Aug, 2022 17:58 IST|Sakshi

ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్‌​ మెక్‌గ్రాత్ టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉందని అన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న నేపథ్యంలో మెక్‌గ్రాత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితో పాటు మరో 27 మంది ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్న బౌలర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 

ఇదే సందర్భంగా వన్డే క్రికెట్‌ మనుగడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు. బ్యాటర్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్‌కు ఢోకా లేదని అభిప్రాయపడ్డాడు. డబ్బు, శారీరక ఒత్తిడి కారణంగా ఆటగాళ్లు వన్డేలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారని అనుకోవట్లేదని అన్నాడు. తన మట్టుకు సంప్రదాయ టెస్ట్‌ క్రికెటే అత్యుత్తమమని చెప్పుకొచ్చాడు. టెస్ట్‌ల తర్వాత ఆటగాళ్ల సత్తా బయటపడేది వన్డే క్రికెట్‌లోనేనని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనే ఆటగాళ్లకు సరైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. 
చదవండి: ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదల.. ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు