IPL 2022: 'ధోని భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'

5 Jun, 2022 19:43 IST|Sakshi
PC: ipl.com

ఐపీఎల్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దారుణంగా విఫలమైంది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే  సీఎస్‌కే పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఆ జట్టు యువ ఆటగాళ్లు ముఖేష్‌ చౌదరి, సిమ్రంజీత్ సింగ్ తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా సీఎస్‌కే టివీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ కెప్టెన్‌ ఎంస్‌ ధోనిపై సిమ్రంజీత్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

జట్టులోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించి వారిని సిద్ధం చేయడంలో ధోని కీలక పాత్ర పోషిస్తాడని సిమ్రంజీత్ తెలిపాడు. ఈ ఏడాది సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సిమ్రంజీత్ 4 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 7.67గా ఉంది.  "ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎలా ఉండాలో మహి భాయ్  నుంచి నేర్చుకున్నాను. నేను బౌలింగ్‌ చేసేటప్పడు ధోని నాకు ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటాడు. అదే విధంగా బౌలింగ్‌ను మెరుగ్గా చేయమని నన్ను ప్రోత్సహించాడు.

కాగా ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నేను  బాగా బౌలింగ్ చేశానని మహి భాయ్ చెప్పాడు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎస్‌ఆర్‌హెచ్‌తో నా తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో నేను భయపడలేదు. అయితే మ్యాచ్‌ మధ్యలో కాస్త ఒత్తిడికి గురయ్యాను. నేను  ప్రేక్షకుల మధ్య తొలి సారిగా స్టేడియంలోకి అడుగుపెట్టినప్పుడు కొత్తగా అనిపించింది. బెంచ్‌పై కూర్చోవడానికి, ప్లేయింగ్ ఎలెవెన్‌లో భాగం కావడానికి చాలా తేడా ఉంది" అని సిమ్రంజీత్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: 'రోహిత్‌ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు'

మరిన్ని వార్తలు