T20 World Cup Sqaud: దినేశ్‌ కార్తీక్‌ను టీ20 ప్రపంచకప్ ఆడనివ్వను.. గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు

14 Jun, 2022 18:03 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ స్టార్‌ దినేశ్‌ కార్తీక్‌పై భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2022 కోసం ఎంపిక చేసే భారత జట్టులో డీకే స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. కార్తీక్ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడాతానంటే కుదరదని అన్నాడు. టీమిండియా కార్తీక్‌ లాంటి మ్యాచ్‌ ఫినిషర్‌ కోసమే వెతుకుతున్నప్పటికీ.. ఆ రోల్‌కు సంపూర్ణ న్యాయం జరగాలంటే ఆల్‌రౌండర్ అయితేనే బెటర్‌ అని అభిప్రాయపడ్డాడు. డీకే కేవలం రెండు, మూడు ఓవర్లు ఆడేందుకు మాత్రమే పరిమితమైతే అతన్ని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయడం వృధా అని అన్నాడు. 

కార్తీక్‌కు బదులుగా రిషబ్‌ పంత్‌, దీపక్‌ హూడా, జడేజా, హార్థిక్‌ పాండ్యా లాంటి ఆటగాళ్లను ప్రిఫర్‌ చేస్తానని పేర్కొన్నాడు. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్న జట్టులో కార్తీక్‌కి చోటు దక్కుతుందని అనుకోవడం లేదని తెలిపాడు. కార్తీక్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో పాటు సుదీర్ఘంగా క్రీజ్‌లో ఉండటంపై కాన్సంట్రేట్‌ చేయాలని సూచించాడు. తుది జట్టులో ఆడించే ఛాన్స్‌ లేనప్పుడు డీకేను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడంలో ఉపయోగం లేదని అన్నాడు. 

కాగా, 37 ఏళ్ల కార్తీక్‌ ఐపీఎల్‌ 2022లో అదరగొట్టి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున మెరుపులు మెరిపించిన కార్తీక్‌ సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో నామమాత్రపు ప్రదర్శనతో నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో 2 బంతులు మాత్రమే ఆడిన కార్తీక్, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌.. 55 సగటున 183.33 స్ట్రైయిక్ రేటుతో 330 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవుతానని కార్తీక్ ధీమాగా ఉన్నాడు. 
చదవండి: 30 ఏళ్లు దాటిన వారిని టీమిండియాకు ఎంపిక చేయరట..!

మరిన్ని వార్తలు