IPL 2022: 'కోహ్లి బ్యాటింగ్‌ చూస్తే జాలేస్తోంది..'

5 May, 2022 16:55 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రాణించడంలో విఫలమయ్యాడు. ఆరంభంలో డుప్లెసిస్‌తో కలిసి మంచి ఆరంభం ఇచ్చినప్పటికి.. అదే జోరును మ్యాచ్‌ మొత్తం చూపెట్టలేకపోయాడు. 33 బంతుల్లో 30 పరుగులతో వన్డే తరహాలో ఆడిన కోహ్లి చివరకు ఆఫ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. గతేడాది చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఇదే తరహాలో మొయిన్‌ అలీ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం.

ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌లో కోహ్లి 16 డాట్‌ బంతులు ఆడాడు. ఇక గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను అనవసర రన్‌కు పిలిచి రనౌట్‌ అవ్వడానికి ప్రధాన కారణమయ్యాడు. మహిపాల్‌ లామ్రోర్‌, రజత్‌ పాటిదార్‌, దినేష్‌ కార్తిక్‌లు రాణించి ఉండకపోతే ఆర్‌సీబీ పరిస్థితి వేరుగా ఉండేది.కాగా కోహ్లి ఈ సీజన్‌లో తన పూర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 178 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి .. సీజన్‌లో తక్కువ స్కోరు నయోదు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

కోహ్లి బ్యాటింగ్‌ తీరుపై వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కోహ్లి బ్యాటింగ్‌ చూస్తుంటే జాలేస్తోంది. స్పిన్‌ ఆడడంలో కింగ్‌గా కనిపించిన కోహ్లికి ఇప్పుడదే పెద్ద వీక్‌నెస్‌గా మారింది. ఒక సీమర్‌ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా సూపర్‌ సిక్స్‌ కొట్టిన కోహ్లి..  ఆ తర్వాతి ఓవర్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. బౌండరీలు కొట్టలేని స్థితిలో సింగిల్స్‌తోనే వేగంగా ఆడే కోహ్లి ఇప్పుడు కనిపించడం లేదు. కోహ్లి ఫిప్టీ కొడితే అందులో 10-15 పరుగులు కేవలం సింగిల్స్‌ రూపంలో వచ్చేవి. అలాంటి కోహ్లి స్పిన్‌ బౌలింగ్‌లో ఫేలవంగా ఆడుతున్నాడు. అయితే అతనికి ఇది కొత్త మాత్రం కాదు. గత సీజన్‌తో పాటు.. పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్పిన్‌ ఆడడంలో విఫలమవుతూ వస్తున్నాడు. అందుకే కోహ్లిని చూస్తే జాలేస్తోంది అనే పదం వాడాల్సి వచ్చింది.'' అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు