'మెన్స్‌ టి20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు!

29 Dec, 2021 18:35 IST|Sakshi

ఐసీసీ మెన్స్‌ టి20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు సంబంధించి ఐసీసీ బుధవారం నలుగురు ఆటగాళ్లను నామినేట్‌ చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌, శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా, ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్‌ మార్ష్‌, పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌లు ఉన్నారు. 

ఇంగ్లండ్‌కు చెందిన జోస్‌ బట్లర్‌ ఈ ఏడాది టి20 క్రికెట్‌లో అద్భుత ఫామ్‌ కనబరిచాడు. ఈ రైట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్‌ 589 పరుగులు సాధించాడు. ఇటీవలే జరిగిన టి20 ప్రపంచకప్‌ 2021లో 269 పరుగులతో దుమ్మురేపాడు.

ఆస్ట్రేలియా చిచ్చరపిడుగు మిచెల్‌ మార్ష్‌ పేరు చెప్పగానే.. 2021 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ గుర్తురాక మానదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 50 బంతుల్లో 77 పరుగులు చేసి ఆసీస్‌ టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా మార్ష్‌ ఈ ఏడాది టి20 క్రికెట్‌లో 627 పరుగులు సాధించాడు. 

పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. టి 20 క్రికెట్‌లో ఓపెనర్‌గా దుమ్మురేపాడు. ఒక్క ఏడాదిలో టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రిజ్వాన్‌ రికార్డు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది టి20 క్రికెట్‌లో పాకిస్తాన్‌ తరపున 1326 పరుగులు చేశాడు. ఇక టి20 ప్రపంచకప్‌ 2021లో రిజ్వాన్‌ 281 పరుగులు సాధించడం విశేషం.

శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా టి20 ప్రపంచకప్‌ 2021లో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. అంతేకాదు ఈ ఏడాది టి20 క్రికెట్‌లో 36 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ తనదైన పాత్ర పోషించాడు.

మరిన్ని వార్తలు