Nuwan Zoysa: మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. మాజీ క్రికెటర్‌పై ఆరేళ్ల నిషేధం

28 Apr, 2021 19:38 IST|Sakshi

దుబాయ్‌: శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్‌సాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నువాన్ జోయ్‌సా తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతడిపై ఆరోపణలు ఉన్నాయి. టీ10 లీగ్‌లో చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకుగానూ జోయ్‌సాపై నిషేధం విధించినట్లు తెలిపింది. శ్రీలంక తరపున1997-2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన జోయ్‌సా 30 టెస్టుల్లో 64 వికెట్లు.. 95 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు 

కాగా  జోయ్‌సాపై విధించిన ఆరేళ్ల నిషేధం 31 అక్టోబర్ 2018 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ ప్రకటన చేసింది. ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం... ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి. కాగా జోయ్‌సా ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

చదవండి: యూఏఈ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం

మరిన్ని వార్తలు