2024 టీ20 వరల్డ్‌కప్‌ వేదికలను ఖరారు చేసిన ఐసీసీ

22 Sep, 2023 20:55 IST|Sakshi

వచ్చే ఏడాది (2024) వెస్టిండీస్‌, యూఎస్‌ఏల్లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ వేదికలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్‌ 22) ఖరారు చేసింది. కొద్ది రోజుల కిందట యూఎస్‌ఏ వేదికలను ప్రకటించిన ఐసీసీ.. తాజాగా వెస్టిండీస్‌ వేదికలను వెల్లడించింది. కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా అండ్‌ బర్బుడా, బార్బడోస్‌, డొమినికా, గయానా,సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ నగరాల్లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ కన్ఫర్మ్‌ చేసింది. కాగా, ఐసీసీ ముందుగా ప్రకటించిన విధంగా యూఎస్‌ఏలోని డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఇదిలా ఉంటే, 2024 టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననున్న విషయం తెలిసిందే. వీటిలో 12 జట్లకు ఐసీసీ నేరుగా అర్హత కల్పించగా.. మిగతా 8 బెర్త్‌లు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా నిర్ణయించబడతాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్ అర్హత సాధించగా.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన జట్లు (డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌).. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాయి. 13, 14, 15వ జట్లుగా ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌ జట్లు యూరప్‌, ఈస్ట్‌ ఏసియా పసిఫిక్‌ రీజియన్స్‌ క్వాలిఫయింగ్‌ పోటీల ద్వారా అర్హత సాధించాయి. 

మరిన్ని వార్తలు