పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి 

13 Dec, 2022 16:17 IST|Sakshi

నాసిరకం పిచ్‌ తయారు చేసినందుకు గాను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుపై (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కన్నెర్ర చేసింది. పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌కు (డిసెంబర్‌ 1 నుంచి 5) వేదిక అయిన రావల్పిండి పిచ్‌ను మందకొడిగా తయారు చేసినందుకు గాను ఐసీసీ.. పీసీబీకి మొట్టికాయలు వేసింది.

ఈ పిచ్‌ను బిలో యావరేజ్‌గా పేర్కొన్న ఐసీసీ.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే పిచ్‌లా లేదని అక్షింతలు వేసింది. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందించిన రావల్పిండి పిచ్‌.. ఐసీసీ ప‍్రమాణాలకు అనుగుణంగా లేదని ఐసీసీ టెక్నికల్‌ కమిటీ సీరియస్‌ అయ్యింది. చర్యల్లో భాగంగా ఓ డీ మెరిట్‌ పాయింట్‌ను రావల్పిండి పిచ్‌కు అలాట్‌ చేసింది. 8 నెలల వ్యవధిలో ఈ పిచ్‌కు డీ మెరిట్‌ పాయింట్‌ రావడం​ ఇది రెండో సారి. 

ఇదిలా ఉంటే, బ్యాటర్ల కోసం మాత్రమే రూపొందించినది చెప్పుకునే రావల్పిండి పిచ్‌పై ఇరు జట్ల క్రికెటర్లు పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 7 సెంచరీలు నమోదయ్యాయి. బౌలర్లు ఏమాత్రం సహకరించని ఈ పిచ్‌పై ఇంగ్లండ్‌.. తమ బజ్‌బాల్‌ అప్రోచ్‌ను ఇంప్లిమెంట్‌ చేసి 74 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడగా.. పాక్‌ ప్లేయర్స్‌ అబ్దుల్లా షఫీక్‌ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్‌ ఆజమ్‌ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్‌) శతకాలు నమోదు చేశారు. 
 

మరిన్ని వార్తలు