ICC POM 2022: అద్భుత ప్రదర్శన.. విరాట్‌ కోహ్లి తొలిసారిగా.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో..

3 Nov, 2022 13:18 IST|Sakshi

Virat Kohli: అక్టోబర్‌ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి గురువారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి,  దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌, జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికిందర్‌ రజాకు చోటు దక్కింది. 

విరాట్‌ కోహ్లి
కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో అర్ధసెంచరీలతో చెలరేగుతున్నాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 82(నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కింగ్‌.. అనంతరం నెదర్లాండ్స్‌, బంగ్లదేశ్‌పై కూడా అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 220 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆక్టోబర్‌లో కోహ్లి 150.73 స్ట్రైక్‌ రేటుతో 205 పరుగులు సాధించాడు.

డేవిడ్‌ మిల్లర్‌
డేవిడ్‌ మిల్లర్‌ గత నెలలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లోను 59 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. గత నెలలో ఓవరాల్‌గా ఏడు ఇన్నింగ్స్‌లలో   మిల్లర్‌ 303 పరుగులు చేశాడు.

సికిందర్‌ రజా
ఈ జింబాబ్వే స్టార్‌ ఆల్‌ రౌండర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తోను బాల్‌తోను అదరగొడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో రజా తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అదే విధంగా స్కాట్లాండ్‌పై కూడా 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక పాకిస్తాన్‌పై జింబాబ్వే చారిత్రాత్మక విజయం సాధించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రజా మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కూడా రజా మూడు వికెట్లు సాధించాడు.
చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్‌

మరిన్ని వార్తలు