IND VS AUS 1st Test: ప్రాక్టీస్‌ చేయనీకుండా అడ్డుకున్నారు.. ఆసీస్‌ ఓటమిపై మాజీ ప్లేయర్‌ సంచలన వ్యాఖ్యలు

13 Feb, 2023 14:14 IST|Sakshi

BGT 2023: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటడంతో ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీ (120).. జడేజా (5/47, 70, 2/34), అశ్విన్‌ (3/42, 23, 5/37) అత్యుత్తమ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కారణంగా టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేయగా, ఆసీస్‌ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. 

అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్న ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు పిచ్‌పై విషప్రచారం​ చేస్తూ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. మ్యాచ్‌ పూర్తై నేటికి రెండ్రోజులవుతన్నా​ ఆసీస్‌ మాజీల వాగుడకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఆసీస్‌ ఓటమిని ఆ దేశ మీడియా సైతం అంగీకరించినప్పటికీ కొందరు మాత్రం ఇం​కా పేలుతూనే ఉన్నారు.

తాజాగా ఆ దేశ దిగ్గజ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ నాగ్‌పూర్‌ పిచ్‌పై, అక్కడి గ్రౌండ్‌ సిబ్బందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లను ప్రాక్టీస్‌ చేయనీకుండా గ్రౌండ్‌ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించాడు. సిబ్బంది పిచ్‌పై అసందర్భంగా నీళ్లు చల్లి, ప్రాక్టీస్‌ చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు.

తద్వారా తమ ప్లాన్లపై, విజయావకాశాలపై నాగ్‌పూర్‌ గ్రౌండ్‌ సిబ్బంది నీళ్లు చల్లారని వాపోయాడు. తమ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసుకుంటామని అడిగినప్పుడే స్టాఫ్‌ ఇలా చేశారని పేర్కొన్నాడు. ఇది మంచి సంప్రదాయం కాదని, ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరాడు. హీలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల​్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు.  


 

మరిన్ని వార్తలు