ICC T20 Rankings: కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పదిలం.. సెకెండ్‌ ప్లేస్‌కు లంక ప్లేయర్‌

28 Jul, 2021 19:35 IST|Sakshi

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(5వ ర్యాంక్‌), స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌(6వ ర్యాంక్‌)లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఇక శ్రీలంక పర్యటనలో దుమ్మురేపిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్(16వ ర్యాంక్‌), స్పిన్నర్ యుజువేంద్ర చహల్(21వ ర్యాంక్‌), దీపక్ చాహర్(34వ ర్యాంక్‌) మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోగా.. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా 720 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

ఈ విభాగంలో దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ 792 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆఫ్ఘన్‌ బౌలర​ రషీద్‌ ఖాన్‌ ఓ స్థానాన్ని కోల్పోయి మూడో ప్లేస్‌కు పడిపోయాడు. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో నాలుగు వికెట్లతో చెలరేగిన భువీ.. వాషింగ్టన్​ సుందర్(17వ ర్యాంక్‌)​ను వెనక్కు నెట్టి 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. భువీ.. సుందర్ ​కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సాధించి 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. 

ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజామ్, ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే వరుసగా రెండు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ, రాహుల్‌లు గత కొంతకాలంగా అంతర్జాతీయ టీ20లు ఆడనప్పటికీ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి 14వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఆఫ్ఘన్‌ ప్లేయర్‌ మహ్మద్‌ నబీ, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

మరిన్ని వార్తలు