ఐసీసీ ర్యాంకింగ్స్‌: అశ్విన్‌ ఒక్కడే.. పాక్‌ బౌలర్ల కెరీర్‌ బెస్ట్‌

12 May, 2021 18:53 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్‌ బౌలర్లు సత్తా చాటారు. హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, నుమాన్‌ అలీలు ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్‌ బెస్ట్‌ను అందుకున్నారు. హసన్‌ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలవగా.. షాహిన్‌ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో.. నుమాన్‌ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలిచాడు.  

జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో ఈ త్రయం ముఖ్యపాత్ర పోషించింది. అందునా ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఐదు వికెట్లు తీయడం విశేషం. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ అలీ(5-27) ఐదు వికెట్లతో మెరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది(5-52), నుమాన్‌ అలీ(5- 86)తో మెరిశారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. 

ఇక టీమిండియా నుంచి రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక్కడే టాప్‌టెన్‌లో నిలిచాడు. అశ్విన్‌ (850 పాయింట్లతో) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. బుమ్రా 11వ స్థానంలో నిలిచాడు. ఇక  తొలి స్థానంలో కమిన్స్‌(908 పాయింట్లు), నీల్‌ వాగ్నర్‌( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు.   
చదవండి: 'చాలా థ్యాంక్స్‌.. మమ్మల్ని బాగా చూసుకున్నారు'
'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు'

మరిన్ని వార్తలు