ICC WC League 2019-2023: యూఏఈకి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన నేపాల్‌ 

12 Mar, 2023 16:20 IST|Sakshi

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్ టూ 2019-23లో భాగంగా యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నేపాల్‌ సంచలన విజయం సాధించింది. లీగ్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లోనూ యూఏఈకి షాకిచ్చిన నేపాల్‌.. నేటి మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  

నేపాల్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న యూఏఈ కీర్తిపూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి నేపాల్‌ను 248 పరుగులకు ఆలౌట్‌ చేసింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (77) అర్ధసెంచరీతో కదంతొక్కగా.. భిమ్‌  షార్కీ (29), ఆరిఫ్‌ షేక్‌ (43), గుల్సన్‌ ఝా (37), దీపేంద్ర సింగ్‌ (34) ఓ మోస్తరుగా రాణించారు.

యూఏఈ బౌలర్లలో ఆఫ్జల్‌ ఖాన్‌ (2/47), ఆర్యన్‌ ఖాన్‌ (1/28), జునైద్‌ సిద్దిఖీ (1/49), జహూర్‌ ఖాన్‌ (2/35), ముస్తఫా (2/61), జవార్‌ ఫరీద్‌ (2/9) వికెట్లు పడగొట్టారు. అనంతరం 249 పరుగుల ఓ మోస్తరు లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. నేపాల్‌ బౌలర్లు లలిత్‌ (5/20), సందీప్‌ లమిచ్చాన్‌ (2/14), సోమ్‌పాల్‌ (1/6), దీపేంద్ర సింగ్‌ (1/15), గుల్సన్‌ ఝా (1/15)ల ధాటికి 22.5 ఓవర్లలో 71 పరుగులకే చాపచుట్టేసింది.

యూఏఈ ఇన్నింగ్స్‌లో అయాన్‌ అఫ్జల్‌ (29), అష్వంత్‌ చిదంబరం (14), కార్తీక్‌ మెయ్యప్పన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. లీగ్‌లో భాగంగా ఇరు జట్లు మార్చి 16న మరోసారి తలపడనున్నాయి. 

మరిన్ని వార్తలు