ఐసీసీ మహిళల అత్యుత్తమ టీ20 జట్టులోనూ టీమిండియా ప్లేయర్లదే హవా

23 Jan, 2023 16:03 IST|Sakshi

ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్‌ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ ఐసీసీ బెస్ట్‌ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. 

ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్‌), బెత్‌ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ..  వన్‌డౌన్‌లో సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌, కెప్టెన్‌), ఆతర్వాతి స్థానాలకు ఆష్‌ గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా), నిదా దార్‌ (పాకిస్తాన్‌), దీప్తి శర్మ (భారత్‌), రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌, భారత్‌), సోఫీ ఎక్లెస్టోన్‌ (ఇంగ్లండ్‌), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్‌ (భారత్‌)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్‌ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం.  

మరిన్ని వార్తలు