ఆసీస్‌ను నిలువరించేనా?

19 Mar, 2022 04:44 IST|Sakshi

నేడు భారత జట్టు కీలకపోరు

ఒత్తిడిలో మిథాలీ రాజ్‌ బృందం

ఉదయం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

ఆక్లాండ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నేడు జరిగే లీగ్‌ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్‌ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది.

అయితే నిలకడలేమి జట్టును ఆందోళన పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్నీ రంగాల్లో భారత్‌ స్థిరంగా రాణించాలి. అప్పుడే మిగతా మ్యాచ్‌ల్ని గెలవొచ్చు. సెమీస్‌ చేరొచ్చు. లేదంటే లీగ్‌ దశలోనే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 12 సార్లు తలపడ్డాయి. భారత్‌ 3 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 49 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 10 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

మరిన్ని వార్తలు