‘తప్పిదాలు తెలుసుకో.. లేకపోతే నీ ప్లేస్‌ ఉండదు’

10 Dec, 2020 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టులో సంజూ శామ్సన్‌కు చోటు దక్కినా అది అతనికి నిరాశే మిగిల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఆడిన శామ్సన్‌ 48 పరుగులు మాత్రమే చేశాడు. శామ్సన్‌కు వచ్చే అవకాశాలే అడపా దడపా అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో శామ్సన్‌ విఫలమవుతూనే ఉన్నాడు.  కాగా, శామ్సన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సుతిమెత్తగా హెచ్చరించాడు. శామ్సన్‌లో విశేషమైన టాలెంట్‌  ఉందంటూనే తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలన్నాడు. (అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి)

ప్రతీ ఒక్కరు తప్పులు చేస్తారని, అప్పుడే నేర్చుకునే అవకాశం దక్కుతుందని భజ్జీ తెలిపాడు. ఇది శామ్సన్‌ ఎక్కువగా విదేశీ పర్యటనల్లో ఆడిన సందర్భాలు లేవని, కానీ అతనిలో విపరీతమైన టాలెంట్‌ మాత్రం ఉందన్నాడు. ఈ తరహా క్రికెటర్లే టీమిండియా ఆశాకిరణాలను భజ్జీ పేర్కొన్నాడు. ఒకవేళ చేసిన తప్పిదాల నుంచి మాత్రం శామ్సన్‌ పాఠాలు నేర్చుకుని గాడిలో పడకపోతే అతని టాలెంట్‌ వృథా అవుతుందన్నాడు. అదే సమయంలో శామ్సన్‌ ప్లేస్‌కు ఉండదనే విషయం గ్రహించాలన్నాడు. ఇప్పుడు శామ్సన్‌ చేయాల్సిందల్లా ఎందుకు విఫలం అయ్యాననే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించాలన్నాడు. 

గతనెల్లో  ముగిసిన ఐపీఎల్‌లో శామ్సన్‌ బ్యాట్‌ నుంచి కొన్ని మెరుపులు రావడంతో అతనికి టీమిండియా జట్టులో చోటు దక్కింది. శామ్సన్‌ను వన్డేలకు, టీ20లకు ఎంపిక చేసిన టీమిండియా సెలక్టర్లు.. రిషభ్‌ పంత్‌ను సైతం పక్కన పెట్టింది. కానీ ఇది శామ్సన్‌కు పెద్దగా లాభించలేదు. ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో వచ్చిన అవకాశాన్ని ఆయా ప్లేయర్లు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. గతంలో రిషభ్‌ వరుసగా విఫలం కావడంతోనే అతన్ని  పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సిరీస్‌లో పంత్‌కు టెస్టు సిరీస్‌లో మాత్రమే అవకాశం దక్కింది. అతనికి పోటీగా సాహా కూడా ఉన్నాడు. ఈ సిరీస్‌లో సాహాకే ఎక్కువ అవకాశాలు రావచ్చని అంచనా. ఐపీఎల్‌లో సాహా బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు కీపర్‌గా పంత్‌ కన్నా సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి ప్రాధాన్యత అతనిదే కావొచ్చు. (అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్‌)

మరిన్ని వార్తలు