హైదరాబాద్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌; స్టేడియానికి ఇలా వెళితే బెటర్‌!

24 Sep, 2022 14:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్‌ 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న టీ20 మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోసం పోలీసులు కొన్ని సూచనలు చేశారు. వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి ప్రజా రవాణాను వినియోగిస్తే స్టేడియానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. అభిమానుల కోసం మెట్రో రైల్‌, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు.


25న ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు

ఉప్పల్‌లో సెప్టెంబర్‌ 25న జరగనున్న టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికుల  సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టింది. స్టేడియం మెట్రో స్టేషన్‌ నుండి ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అమీర్‌పేట్, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుండి కనెక్టింగ్‌ రైళ్లు ఉంటాయి. 


ప్రత్యేక రైళ్ల సేవ సమయంలో, ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతిస్తారు. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరుస్తారు. మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే లేదా కనీసం రిటర్న్‌ టిక్కెట్‌లను కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ప్రయాణ సౌలభ్యం కోసం, క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్‌ కార్డులను ఉపయోగించాలని కోరారు.  


టీ–20 మ్యాచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 

ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజనల్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. ఉప్పల్‌ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్, జేబీఎస్, మేడ్చల్, హకీంపేట్, మెహిదీపట్నం, కోఠి, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుపనున్నారు. (క్లిక్ చేయండి: టి-20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు)

మరిన్ని వార్తలు