Ind Vs Aus 2nd ODI: ఘోర ఓటమి.. టీమిండియా చెత్త రికార్డులివే! మరీ దారుణంగా..

20 Mar, 2023 07:58 IST|Sakshi

India vs Australia, 2nd ODI: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ గెలుస్తారని ఆశించిన అభిమానులను టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. స్వదేశంలో ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. పరుగులు తీయడానికి బదులు.. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి భారత ‘స్టార్లు’ పెవిలియన్‌కు క్యూ కట్టడంలో పోటీపడ్డారు.

విరాట్‌ కోహ్లి ఒక్కడు 31 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీళ్లిద్దరు మినహా ‘పటిష్ట’ టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌లోని ఏ ఒక్క బ్యాటర్‌ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డారు. 

ఊహించని రీతిలో..
వెరసి విశాఖపట్నంలోని ఆదివారం నాటి మ్యాచ్‌లో 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే రోహిత్‌ సేన కథ ముగిసింది. భారత బ్యాటర్లు విఫలమైన చోట.. ఆసీస్‌ ఓపెనర్లు ఊహించని రీతిలో చెలరేగారు. ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 51, మిచెల్‌ మార్ష్‌ 36 బంతుల్లో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.

వీరిద్దరి మెరుపు బ్యాటింగ్‌తో 11 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే కంగారూ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ ఘోర పరాభవం నేపథ్యంలో టీమిండియా పేరిట పలు చెత్త రికార్డులు నమోదయ్యాయి.  

స్వదేశంలో ఇలా
సొంతగడ్డపై టీమిండియాకు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. శ్రీలంకతో మ్యాచ్‌లో 1986లో 78, వెస్టిండీస్‌తో 1993లో 100, 2017లో శ్రీలంకతో 112 పరుగులు చేసిన భారత జట్టు.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా ఈ మేరకు నాలుగో అత్యల్ప స్కోరు(117) నమోదు చేసింది.

అతిపెద్ద ఓటమి
234: రెండో వన్డేలో ఆసీస్‌ విజయం పూర్తయిన సమయానికి మిగిలి ఉన్న బంతులు. మిగిలి ఉన్న బంతుల పరంగా వన్డేల్లో భారత్‌కిదే అతిపెద్ద ఓటమి.  

ఆసీస్‌ చేతిలో..
2: స్వదేశంలో భారత్‌ ఓ వన్డేలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. 2020లో ముంబైలో ఆసీస్‌ చేతిలోనే భారత్‌ తొలిసారి 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఇక ఓవరాల్‌గా ఆరోసారి ఈ మేరకు ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. 1981లో న్యూజిలాండ్‌, 1997లో వెస్టిండీస్‌, 2000, 2005లో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని మూటగట్టుకుంది.

పేసర్లకు తలవంచి
2: స్వదేశంలో భారత జట్టు మొత్తం 10 వికెట్లను పేసర్లకే కోల్పోవడం ఇది రెండోసారి. 2009లో గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ పేస్‌ బౌలర్లు (బొలింగర్‌ 5, మిచెల్‌ జాన్సన్‌ 3, వాట్సన్‌ 2 వికెట్లు) ఈ ఘనత సాధించారు. 

చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం
IND VS AUS 2nd ODI: బీస్ట్‌ ఈజ్‌ బ్యాక్‌.. పేస్‌తో గడగడలాడించి టీమిండియాకు చుక్కలు చూపించిన స్టార్క్‌
Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు

మరిన్ని వార్తలు