IND VS AUS 3rd ODI: సెంచరీ కొట్టిన సిరాజ్‌

22 Mar, 2023 21:09 IST|Sakshi

టీమిండియా యువ పేసర్‌, హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ మహ్మద్‌ సిరాజ్‌ 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు.  చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. 18 టెస్ట్‌ల్లో 47 వికెట్లు, 8 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌ మియా 24 వన్డేల్లో 47 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 50 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 101 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని కోల్పోయిన రోజే సిరాజ్‌ 100 వికెట్ల మైలురాయిని అధిగమించడం విశేషం. ప్రస్తుత వన్డే  ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ తొలిస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానంలో ఉన్న జోష్‌ హాజిల్‌వుడ్‌ అగ్రస్థానానికి ఎగబాకగా.. మూడో స్థానంలో ఉన్న ట్రెంట్‌ బౌల్ట్‌ సెకెండ్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు. 

ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. మహ్మద్‌ సిరాజ్‌ (7-1-37-2), అక్షర్‌ పటేల్‌ (8-0-57-2), హార్ధిక్‌ పాండ్యా (8-0-44-3), కుల్దీప్‌ యాదవ్‌ (10-1-56-3) ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 37 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

రోహిత్‌ శర్మ (30), శుభ్‌మన్‌ గిల్‌ (37), కేఎల్‌ రాహుల్‌ (32), అక్షర్‌ పటేల్‌ (2), విరాట్‌ కోహ్లి (54), సూర్యకుమార్‌ యాదవ్‌ (0) ఔట్‌ కాగా.. హార్ధిక్‌ (29), జడేజా (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ గెలవాలంటే 78 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు