IND VS AUS 3rd ODI: రోహిత్‌ రేర్‌ ఫీట్‌.. వన్డేల్లో తొలిసారి..!

27 Sep, 2023 19:41 IST|Sakshi

టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తన వన్డే కెరీర్‌లో తొలిసారి ఓ రేర్‌ ఫీట్‌ను సాధించాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌.. తన వన్డే కెరీర్‌లో మొట్టమొదటి సారి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను పవర్‌ప్లేలో టచ్‌ చేశాడు. హిట్‌మ్యాన్‌ 251 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో తొలిసారి ఇంత వేగంగా (పవర్‌ ప్లేలో) హాఫ్‌ సెంచరీ మార్కును (31 బంతుల్లో) చేరుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హిట్‌మ్యాన్‌ ఇదే జోరును కొనసాగిస్తే రానున్న వరల్డ్‌కప్‌ పవర్‌ప్లేల్లో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలే అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 57 బంతుల్లో 81 పరుగులు చేసిన రోహిత్‌ మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇదే మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ మరో రికార్డును కూడా సాధించాడు. స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (260) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 

న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్‌ (256) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌.. స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్‌ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం​, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ కేవలం 3 సిక్సర్ల దూరంలో (551) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వార్నర్‌ (56), మార్ష్‌ (96), స్టీవ్‌ స్మిత్‌ (74), లబూషేన్‌ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్‌ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్‌ ఔటయ్యాడు. 144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 153/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (46), శ్రేయస్‌ అయ్యర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు