Ind Vs Aus 1st Test Day 3: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. తొలి టెస్టులో ఘన విజయం

11 Feb, 2023 09:40 IST|Sakshi

India vs Australia, 1st Test Day 3 Updates And Highlights: నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఆసీస్‌ను భారత్‌ చిత్తు చేసింది. 223 పరుగుల వెనుకంజలో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారత స్నిన్నర్ల దాటికి 91 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లతో ఆసీస్‌ వెన్ను విరచగా.. జడేజా రెండు, షమీ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

ఆసీస్‌ బ్యాటర్లలో స్మిత్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైన భారత్‌.. ఆసీస్ ముందు 223 పరుగుల ఆధిక్యాన్ని నిలిపింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(120) సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 70, అక్షర్‌ పటేల్‌ 84 పరుగులతో రాణించారు.

అదే విధంగా ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.  అదే విధంగా ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
తొలి టెస్టులో టీమిండియా మరింత చేరువైంది. 88 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన లియాన్‌.. షమీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

26.3: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మర్ఫీ అవుట్‌.స్కోరు:  75-8

భారత స్పిన్నర్ల విజృంభణ.. విలవిల్లాడుతున్న ఆసీస్‌ బ్యాటర్లు
22.4: ఏడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

జడేజా బౌలింగ్‌లో కమిన్స్‌ అవుట్‌. స్కోరు:  67-7. ఇప్పటి వరకు అశ్విన్‌ ఐదు, జడేజా రెండు వికెట్లు తీశారు.

19.2: ఆరో వికెట్‌ డౌన్‌

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది.  6 పరుగులు చేసిన హ్యండ్స్‌కాంబ్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇప్పటివరకు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అశ్విన్‌ మాయాజాలం
భారత స్పిన్నర్లకు మరోసారి ఆసీస్‌ బ్యాటర్లు తడబడుతున్నారు. 41 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అదే విధంగా మరో బ్యాటర్‌ రెన్‌షా(2) కూడా అశ్విన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 16 ఓవర్లకు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
26 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లబుషేన్‌.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో వార్నర్‌, స్మిత్‌ ఉన్నారు. 11 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 26/2

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా అదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఖవాజా.. అశ్విన్‌ బౌలింగ్‌లో ​కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ ఉన్నారు.

 400 పరుగులకు భారత్‌ ఆలౌట్‌
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 400 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 223 ఆధిక్యం లభించింది. ఇక భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(120) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(70),అక్షర్‌ పటేల్‌(84) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. కాగా ఆసీస్‌ బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ 7 వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు పాట్‌ ‍కమ్మిన్స్‌ రెండు, లియాన్‌ ఒక వికెట్‌ సాధించారు.

139 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 399/9
139 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌ పటేల్‌(84), సిరాజ్‌ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 222 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొమ్మిదో కోల్పోయిన టీమిండియా
132.4: మర్ఫీ బౌలింగ్‌లో షమీ అవుట్‌. వికెట్‌ కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన షమీ(37). అక్షర్‌ పటేల్‌(70), సిరాజ్‌ క్రీజులో ఉన్నారు.

132: నిలకడగా ఆడుతున్న అక్షర్‌, షమీ.. స్కోరు:  380-8

131: సిక్సర్లతో చెలరేగిన షమీ
మర్ఫీ బౌలింగ్‌లో భారత పేసర్‌ షమీ వరుస సిక్సర్లు బాదాడు. 42 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన షమీ.. అక్షర్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 

118.2: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. టాడ్‌ మర్ఫీ తన మాయాజాలం ప్రదర్శించి జడ్డూ(70)ను బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ అరంగేట్ర స్పిన్నర్‌ మర్ఫీకిది ఆరో వికెట్‌ కావడం విశేషం.
ఇక ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌, షమీ క్రీజులో ఉన్నారు. స్కోరు: 328/8 (119). 151 పరుగుల ఆధిక్యంలో భారత్‌.

ఆట ఆరంభం
►నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మూడో రోజు  ఆట ప్రారంభమైంది. క్రీజులో రవీంద్ర జడేజా(67), అక్షర్‌ పటేల్‌(54) పరుగులతో ఉన్నారు. 
►ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. 

తుది జట్లు:
టీమిండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్.

మరిన్ని వార్తలు