Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్‌ ఎలా ఉందంటే!

24 Feb, 2023 14:17 IST|Sakshi

India vs Australia Test Series: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పిచ్‌ గురించి ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నాగ్‌పూర్‌లోని మొదటి టెస్టుకు ముందు పిచ్‌ను పరీక్షిస్తూ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ తదితరులు చేసిన ఓవరాక్షన్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అంతేగాక మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ క్రికెట్‌.. ‘‘డాక్టర్డ్‌ పిచ్‌’’ అంటూ టీమిండియాను తక్కువ చేసే విధంగా వ్యాఖ్యలు చేసింది.

రెండున్నరోజుల్లో ముగిసిన టెస్టులు
భారత జట్టు తమకు అత్యంత అనూకూల పిచ్‌ను రూపొందించుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్‌ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోగా.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు కూడా ఇదే తరహాలో ముగిసింది. 

ఈ రెండింటిలోనూ గెలుపొందిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో పర్యాటక కంగారూ జట్టు అసహనం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌లకు యావరేజ్‌ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ గురువారం వెల్లడించింది. 

మ్యాచ్‌ రిఫరీ, జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్‌ ఈ మేరకు రేటింగ్‌ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో కొంతమంది ఆసీస్‌ క్రికెటర్లు ఆరోపించినట్లుగా పిచ్‌ మరీ అంత చెత్తగా ఏమీ లేదని స్పష్టమైంది. కాగా ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

జడ్డూ, అక్షర్‌ హిట్‌.. ఆసీస్‌ బ్యాటర్లు తుస్‌
ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ స్టేడియంలో తొలి, ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు జరిగాయి. సాధారణంగానే స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగారు. భారత స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ బ్యాట్‌తోనూ మ్యాజిక్‌ చేశారు.  వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో 254 పరుగులు చేశారు.

ఇప్పటికైనా..
ఆస్ట్రేలియా లెఫ్టాండర్లు ఉస్మాన్‌ ఖవాజా, ట్రావిస్‌ హెడ్‌, అలెక్స్‌ క్యారీ, డేవిడ్‌ వార్నర్‌, మ్యాట్‌ కుహ్నెమన్‌, మ్యాట్‌ రెన్షా, టాడ్‌ మర్ఫీ చేసిన 242 పరుగుల కంటే జడ్డూ, అక్షర్‌ సంయుక్త స్కోరే ఎక్కువ. జడ్డూ, అక్షర్‌ ఇలా చెలరేగితే ఆసీస్‌ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేయడం వారి వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. కాబట్టి పిచ్‌పై నిందలు వేసే బదులు ఓటమిని హుందాగా అంగీకరిస్తే బాగుండేదని టీమిండియా ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: T20 WC: 'మ్యాచ్‌కు అదే టర్నింగ్‌ పాయింట్‌.. లేదంటే విజయం మాదే'
IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌! కెప్టెన్‌గా స్మిత్‌

మరిన్ని వార్తలు