Ind Vs Aus 3rd T20: హైదరాబాద్‌ మ్యాచ్‌.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు! వారికి నిరాశే!

17 Sep, 2022 08:59 IST|Sakshi

India Vs Australia T20 Series- 3rd T20 Hyderabad- Uppal: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్‌– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. క్రికెట్‌ అభిమానులు ఎంతో ఉత్కంఠగా టికెట్ల కోసం ఎదురుచూసినప్పటికీ నిరాశే మిగిలింది. కేవలం కొన్ని క్షణాల్లోనే వేలాది టికెట్లు అమ్ముడుపోవడం.. కనీసం టికెట్లు అందుబాటులో ఉన్నట్లు పేటీమ్‌ యాప్‌లో చూపకపోవడం అభిమానులు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు.

టికెట్లు చూపకుండానే అమ్ముడుపోయినట్లు ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ఉప్పల్‌ స్టేడియంలో 55వేల సీట్ల సామర్థ్యం కాగా, టికెట్లను మాత్రం 38వేలలోపు మాత్రమే విక్రయిస్తారు. మిగతా టికెట్లు నిర్వాహకులు, స్పాన్సర్లకు కేటాయిస్తారు. ఈ మేరకు రూ.850 మొదలు రూ.10వేల వరకు టికెట్ల విక్రయించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

తొలుత గురువారం ఉదయం 11 గంటలకు టికెట్లు పేటీమ్‌లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో వాయిదా వేసిన నిర్వాహకులు.. శుక్రవారం రాత్రి 8 గంటలకు టికెట్లను విక్రయించనున్నట్లు ప్రకటించింది.

ప్రకటించిన సమయానికే యాప్‌లను ఓపెన్‌ చేసి లాగిన్‌ అయిన క్రికెట్‌ అభిమానులకు.. హైదరాబాద్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు.. స్క్రీన్‌పై 10 గంటలకు ప్రత్యక్షమయ్యాయి. టికెట్‌ కోసం ఓపెన్‌ చేసిన అభిమానులకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయని స్క్రీన్‌పై సమాచారం రావడంతో నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-సాక్షి, సిటీబ్యూరో

చదవండి: Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్‌, జట్లు.. ఇతర వివరాలు!
పఠాన్‌ బ్రదర్స్‌ విధ్వంసం.. ఇండియా మహారాజాస్‌ ఘన విజయం

మరిన్ని వార్తలు