Ind Vs Aus T20 Series: టీమిండియాతో సిరీస్‌.. ఆసీస్‌కు భారీ షాక్‌! ముగ్గురు ఆటగాళ్లు అవుట్‌!

14 Sep, 2022 13:29 IST|Sakshi

Australia tour of India, 2022- Ind Vs Aus T20 Series: టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. కాగా రోహిత్‌ సేనతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు కంగారూ జట్టు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వచ్చే మంగళవారం(సెప్టెంబరు 20)న ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ స్టార్క్‌ చోటు దక్కించుకున్నారు.

ఈ ముగ్గురి స్థానాలు భర్తీ చేసేది వీళ్లే!
అయితే, ఈ ముగ్గురిని గాయాల బెడద వేధిస్తోంది. స్టార్క్‌ ఇప్పుడిప్పుడే మోకాలి నొప్పి నుంచి కోలుకుంటుండగా.. మార్ష్‌ పాదానికి గాయమైంది. ఇక స్టొయినిస్‌ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది.

ఇక వీరి స్థానాలను ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ ఎలిస్‌, ఆల్‌రౌండర్లు డేనియల్‌ సామ్స్‌, సీన్‌ అబాట్‌లతో భర్తీ చేసినట్లు సమాచారం. కాగా అక్టోబరు 16 నుంచి స్వదేశంలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో కూడా తాము భారత్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు సీఏ వెల్లడించింది.

డేవిడ్‌ వార్నర్‌(ఈ ఓపెనర్‌కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో కామెరూన్‌ గ్రీన్‌) మినహా అందరూ టీమిండియాతో సిరీస్‌ ఆడతారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం స్టార్క్‌, స్టొయినిస్‌, మార్ష్‌ గాయాల కారణంగా దూరమయ్యారు. ప్రపంచకప్‌ ఆరంభం నాటికి వీరు ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది.

టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా (తాజా) జట్టు:
ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), సీన్‌ అబాట్‌, అష్టన్‌ అగర్‌, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్‌ డేవిడ్‌, నాథన్‌ ఎలిస్‌, కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డేనియల్‌ సామ్స్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, ఆడం జంపా. 

చదవండి: Ind Vs Pak: సరిగ్గా నిద్రపోలేదు.. ట్రోల్స్‌ గురించి కాదు! తను ఎక్కువగా బాధపడ్డది అందుకే!
సూర్యకుమార్‌లో మనకు తెలియని రొమాంటిక్‌ యాంగిల్‌..

>
మరిన్ని వార్తలు