Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్‌ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’

19 Dec, 2022 12:16 IST|Sakshi

India tour of Bangladesh, 2022: ‘‘ఈ అబ్బాయి సెంచరీ చేశాడు. మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే, ఒకవేళ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి వచ్చాడనుకోండి.. కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ల జోడీకే ఓపెనర్లుగా మొదటి ప్రాధాన్యం. కచ్చితంగా రోహిత్‌నే ఆడిస్తారు. ఎందుకంటే తను కెప్టెన్‌ కదా! 

ఇక కేఎల్‌ రాహుల్‌ పరుగులు రాబట్టకపోయినా వాళ్లు అతడిని పక్కన పెట్టే అవకాశమే లేదు. కాబట్టి శుబ్‌మన్‌ గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయకతప్పదు. నాకు తెలిసి.. గతంలో అజింక్య రహానే విషయంలో కూడా ఓసారి ఇలాగే జరిగింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌, వివాదాస్పద కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. 

కాగా బంగ్లాదేశ్‌ టూర్‌ నేపథ్యంలో గాయపడ్డ భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదో మొదటి టెస్టులో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. 

ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేయగలిగిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

రోహిత్‌ వస్తే.. గిల్‌ కచ్చితంగా బెంచ్‌ మీదే
అయితే, రెండో టెస్టు నాటికి రోహిత్‌ అందుబాటులోకి రానున్నాడన్న వార్తల నేపథ్యంలో జట్టులో గిల్‌ స్థానం ప్రశ్నార్థకమైంది. ఓపెనర్‌గా కెప్టెన్‌ బరిలోకి దిగడం ఖాయం.. దీనితో పాటుగా మిడిలార్డర్‌లో పుజారా, కోహ్లి, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు ఉన్న నేపథ్యంలో తుది జట్టులో గిల్‌కు చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై సంజయ్‌ మంజ్రేకర్‌ సోనీ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్‌ జట్టులోకి వస్తే గిల్‌ను తప్పించడం ఖాయమని అంచనా వేశాడు. బంగ్లాదేశ్‌లో టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది కాబట్టి గిల్‌పై వేటువేయక తప్పదని అభిప్రాయపడ్డాడు. అదనపు బ్యాటింగ్‌ ఆప్షన్లుగా అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ ఉండటం కూడా గిల్‌ అవకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్‌- టీమిండియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు..
FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు

మరిన్ని వార్తలు