Jasprit Bumrah: ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్‌ చేసిన భార్య సంజనా!

13 Jul, 2022 12:15 IST|Sakshi

India tour of England, 2022 - Ind Vs Eng 1st ODI: టీమిండియాతో మొదటి వన్డేలో భాగంగా ఇంగ్లండ్‌ బ్యాటర్లు జేసన్‌ రాయ్‌... జో రూట్‌.. లియామ్‌ లివింగ్‌స్టోన్‌.. భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగారు. ఇక జానీ బెయిర్‌స్టో, విల్లే, బ్రైడన్‌ కార్స్‌ సైతం బుమ్రాకు వికెట్లు సమర్పించుకున్నారు. 

ఇలా మొత్తంగా 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు కూల్చిన ఈ పేస్‌గుర్రం టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. దీంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ స్పీడ్‌స్టర్‌.

ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ సైతం ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. భర్తతో కలిసి లండన్‌లో ఉన్న ఆమె ప్రజెంటర్‌గా తన విధులు నిర్వర్తిస్తూనే భార్యగా బుమ్రా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ట్రోల్‌ చేస్తూ తనదైన శైలిలో చమత్కరించారు సంజనా. ఓ ఫుడ్‌ ఏరియాకు వెళ్లిన ఆమె.. ‘‘ఇక్కడ ఇది బిజీ ఏరియా. నిజానికి ఇక్కడ ఇంగ్లండ్‌ అభిమానులే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. 

ఎందుకంటే వాళ్లకు మ్యాచ్‌ చూడటం బహుశా ఇష్టం లేదనుకుంటా! ఇక్కడ హాట్‌ డాగ్స్‌.. ఇంకా ఇతరత్రా ఆహార పదార్థాలు ఉన్నాయి. మేమైతే ఇక్కడి స్టాల్స్‌ను సందర్శిస్తున్నాం. కానీ చాలా మంది ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదు. దీనిని క్రిస్పీ డక్‌ అంటారు. 

మైదానం వెలుపల డక్స్‌ ఎలా ఉంటాయో చూడబోతున్నాం. ఎలాగూ మైదానంలో డక్స్‌ అద్భుతంగా ఉంటాయి కదా’’ అని వ్యాఖ్యానించారు. సంజన మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ 2022 వన్డే సిరీస్‌- మొదటి మ్యాచ్‌:
►వేదిక: ది ఓవల్‌, లండన్‌
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►ఇంగ్లండ్‌ స్కోరు:  110 (25.2)
►ఇండియా స్కోరు: 114/0 (18.4)
►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)

మరిన్ని వార్తలు