MS Dhoni- Saif Ali Khan: విండీస్‌ దిగ్గజంతో ధోని, సైఫ్‌ అలీఖాన్‌.. ఫొటో వైరల్‌

13 Jul, 2022 16:43 IST|Sakshi
విండీస్‌ దిగ్గజం గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌తో ధోని, సైఫ్‌ అలీఖాన్‌(PC: Johns Twitter)

India Vs England ODI Series 2022: ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం అభిమానులకు ఆనందాన్ని పంచింది. భారత బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ విశ్వరూపంతో ఇంగ్లండ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ విజృంభించడంతో దాదాపుగా ఆరేళ్ల తర్వాత భారత జట్టు.. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. బట్లర్‌ బృందానికి సొంతగడ్డపై చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

ఇక ఈ ఆసక్తికర మ్యాచ్‌ను వీక్షించేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఓవల్‌ మైదానానికి రావడం విశేషం. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌ కూడా ఉన్నారు. అదే విధంగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ సైతం తన సతీమణి కరీనా కపూర్‌, పెద్ద కుమారుడు తైమూర్‌ అలీతో స్టేడియానికి విచ్చేశాడు.

ఈ క్రమంలో మిస్టర్‌ కూల్‌ ధోని, గ్రీనిడ్జ్‌తో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరీనా సైతం గ్రీనిడ్జ్‌తో తన భర్త సైఫ్‌ దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. కాగా మొదటి వన్డేలో సంచలన విజయం సాధించిన టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ 2022 వన్డే సిరీస్‌- మొదటి మ్యాచ్‌:
► వేదిక: ది ఓవల్‌, లండన్‌
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►ఇంగ్లండ్‌ స్కోరు:  110 (25.2)
►ఇండియా స్కోరు: 114/0 (18.4)
►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)

చదవండి: ICC world Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?

మరిన్ని వార్తలు