IND Vs ENG: ఆఖరి రోజు ఆటకు వరుణుడి ఆటంకం 

8 Aug, 2021 16:28 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఆఖరి రోజు ఆట ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్‌ ప్రారంభంకావాల్సిన సమయానికి వర్షం కురుస్తుండటంతో ఆట ఆలస్యంగా ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ సేన నాలుగో రోజు వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆట చివర్లో ధాటిగా ఆడిన కేఎల్‌ రాహుల్‌ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా.. రోహిత్‌ శర్మ (12 బ్యాటింగ్‌), పుజారా (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు మరో 157 పరుగులు చేస్తే భారత్‌ విజయ జయభేరి మోగిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపును వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు.

అంతకుముందు 25/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రూట్‌ శతక్కొట్టిన తర్వాత ఔట్‌ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్‌ను కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చాడు. ఓపెనర్‌ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో క్రాలీ (6) సహా లోయర్‌ ఆర్డర్‌లో స్యామ్‌ కరన్‌ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్‌ (0)లను బుమ్రా ఔట్‌ చేశాడు. మరోవైపు శార్దుల్‌... లారెన్స్‌ (25), బట్లర్‌ (17) వికెట్లను పడగొట్టాడు. సిరాజ్‌ 2, షమీ ఓ వికెట్ పడగొట్టారు.

మరిన్ని వార్తలు