IND Vs ENG 3rd Test Day 1: ఇంగ్లండ్‌ అభిమానుల ఓవరాక్షన్‌.. సిరాజ్‌పై బంతితో దాడి

26 Aug, 2021 15:56 IST|Sakshi

లీడ్స్‌: భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అభిమానుల ఓవరాక్షన్‌కు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఇంగ్లండ్ అభిమానులు భారత ఆటగాళ్లను టార్గెట్‌ చేసుకుని దాడులకు దిగుతుండడం విస్మయానికి గురి చేస్తుంది. రెండో టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా కేఎల్ రాహుల్‌పై వాటర్‌ బాటిల్ మూతలను విసిరిన ఘటన మరువక ముందే.. మూడో టెస్టు తొలి రోజు సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంగ్లండ్‌ అభిమాని బంతిని విసిరాడు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతిని తిరిగి వారి వైపే విసరాలని సిరాజ్‌కు సైగ చేశాడు. ఈ విషయాన్ని టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ మీడియా సమావేశంలో వెల్లడించాడు. 

కాగా, సిరాజ్‌పై బంతితో దాడి చేసిన ఆ ఇంగ్లండ్‌ అభిమాని అంతటితో ఆగకుండా ఇండియా స్కోర్ ఎంత అంటూ సిరాజ్‌ను గేలి చేసే ప్రయత్నం చేశారు. అయితే, సిరాజ్ ఆ వ్యక్తికి 1-0 అని సైగ చేస్తూ.. అదిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా ఆధిక్యాన్ని సూచిస్తూ సిరాజ్‌ చేసిన సంజ్ఞలతో  ఆ ఇంగ్లండ్‌ అభిమానికి రివర్స్‌ పంచ్‌ పడినట్లైంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: ENG Vs IND: తొలిరోజే టీమిండియా చెత్త రికార్డులు

మరిన్ని వార్తలు