IND Vs ENG 4th Test Day 1: ఆండర్సన్‌ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..?

2 Sep, 2021 22:22 IST|Sakshi

ఓవల్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ ఆట పట్ల తనకున్న అంకిత భావాన్ని మరోసారి ప్రదర్శించాడు. తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 42 ఓవర్ బౌల్‌ చేస్తున్న జిమ్మీ.. మోకాళ్లకు రక్తపు గాయాలతో కనిపించాడు. రెండు మోకాళ్ల వద్ద ప్యాంట్‌ రక్తంతో తడిసిపోయింది. అయినప్పటికీ  ఆండర్సన్‌ మైదానాన్ని వీడకుండా, తన కోటా ఓవర్‌ను పూర్తి చేశాడు. ఈ సన్నివేశం టీవీల్లో స్పష్టంగా కనిపించడంతో సోషల్‌మీడియాలో వ్యాప్తంగా ఆండర్సన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆట పట్ల ఈ వెటరన్‌ క్రికెటర్‌కు ఉన్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ఆండర్సన్‌ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? అంటూ మరికొందరు కొనియాడుతున్నారు. కాగా, ఈ గాయలు ఎప్పుడు తగిలాయన్నది టీవీల్లో కనబడలేదు. బహుళా ఫీల్డింగ్‌ చేసేటప్పుడు అతను ఈ గాయాల బారిన పడి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 191 పరుగులకు ఆలౌటైంది. కోహ్లి(50), శార్దూల్‌ ఠాకూర్‌(57) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముఖ్యంగా శార్దూల్‌ ఠాకూర్‌ ఆఖర్లో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 4, రాబిన్సన్‌ 3, ఆండర్సన్‌, ఓవర్టన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా రివర్స్‌ కౌంటరిచ్చింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా చెలరేగిపోవడంతో ఇంగ్లీష్‌ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డాడు. టీ విరామానికి ముందు ఇంగ్లండ్‌ స్కోర్‌ 11/2. 
చదవండి: అందుకే మనోళ్లు 'బ్లాక్ రిబ్బన్స్‌'తో బరిలోకి దిగారు..

మరిన్ని వార్తలు