Rohit Sharma: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్‌ ఒక్కడే అత్యధికంగా ఇలా..!

5 Sep, 2021 11:55 IST|Sakshi

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్‌) అద్భుతమైన సెంచరీతో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో సిక్సర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదిన హిట్‌ మ్యాన్‌.. కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లి 73 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తే.. రోహిత్ 74 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 


కాగా, సెహ్వాగ్‌ 2004లో పాక్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్ట్‌లో ట్రిపుల్‌ హండ్రెండ్‌(309) సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వీరూ డబుల్‌ హండ్రెడ్‌ను, ట్రిపుల్‌ సెంచరీని సిక్సర్‌తోనే కంప్లీట్‌ చేశాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్‌ అత్యధికంగా 6 సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకోగా, రోహిత్‌ 3 పర్యాయాలు, గౌతమ్‌ గంభీర్‌(2), రిషబ్‌ పంత్‌(2) ఇదే తరహాలో సెంచరీని కంప్లీట్‌ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా స్పిన్నర్లు హర్భజన్‌, అశ్విన్‌లు అలాగే ద వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌, నయా వాల్‌ పుజారాలు కూడా ఉండడం విశేషం. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. వెరసి శనివారం జరిగిన మూడు సెషన్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా... వెలుతురు మందగించి ఆటను నిలిపి వేసే సమయానికి 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. కెప్టెన్‌  కోహ్లి (22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.
చదవండి: ఇంగ్లండ్‌ జట్టును వేధిస్తున్న ప్రాంక్‌ స్టార్‌ జార్వో అరెస్ట్‌..

>
మరిన్ని వార్తలు