నాలుగో టెస్టు: కోహ్లి, స్టోక్స్‌ మధ్య వాగ్వాదం!

4 Mar, 2021 13:16 IST|Sakshi

అహ్మదాబాద్‌: నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. భారత బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై స్టోక్స్‌ అసహనం వ్యక్తం చేయగా.. కోహ్లి ఇందుకు దీటుగా బదులిచ్చాడు. మొదటి రోజు ఆటలో భాగంగా 12వ ఓవర్‌ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్టార్‌ పేసర్‌ బుమ్రా గైర్హాజరీ నేపథ్యంలో సిరాజ్‌ ఆఖరి టెస్టులో ఆడే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వ ఓవర్‌ తొలి బంతికే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను పెవిలియన్‌కు పంపి, ఈ మ్యాచ్‌లో తన ఖాతాలో తొలి వికెట్‌ వేసుకున్నాడు.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్‌కు చుక్కలు చూపించాడు. మొదటి మూడు బంతుల్లో అతడు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేసిన స్టోక్స్‌.. ఏదో అనబోయాడు. అయితే సిరాజ్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. కానీ కోహ్లి మాత్రం స్టోక్స్‌ బదులిచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. అయితే అంతలోనే అంపైర్లు నితిన్‌ మీనన్‌, వీరేందర్‌ శర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు.. బెయిర్‌ స్టో మాత్రం నవ్వుతూనే స్టోక్స్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో.. ‘‘అసలు అక్కడ ఏం జరిగింది. కోహ్లి స్టోక్స్‌ను ఎందుకో కోపంగా చూశాడు. ఏం చెప్తున్నావు కోహ్లి‌ అని అతడు అడిగి ఉంటాడు. ఏం లేదు, చెప్పినా నీకర్థం కాదులే అని అతడు బదులిచ్చి ఉంటాడు. పర్లేదు నాకు అర్థం అయింది అంటూ స్టోక్స్‌ అని ఉంటాడు’’ అంటూ ఎవరికి తోచిన విధంగా నెటిజన్లు ఈ వీడియోపై జోకులు పేలుస్తున్నారు. కాగా ఆఖరి టెస్టులో భాగంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌, డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి 40 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు అక్షర్‌, సిరాజ్‌ రెండేసి వికెట్లు తీశారు.

చదవండిపంత్‌ ట్రోలింగ్‌.. వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్

రెచ్చిపోయిన పొలార్డ్‌.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు

మరిన్ని వార్తలు