IND VS ENG 5th Test: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్‌ అలీ

30 Jun, 2022 16:11 IST|Sakshi

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న టెస్ట్‌ మ్యాచ్‌పై ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ తన అంచనాలను వెల్లడించాడు. న్యూజిలాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి జోష్‌ మీద ఉన్న ఇంగ్లండ్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ గతేడాదే పూర్తై ఉంటే ఫలితం టీమిండియాకే అనుకూలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు లోడెడ్‌ గన్‌ను తలపిస్తుందని, దానికి ఎదురుపడిన వారు ఎంతటి వారైనా ఫైరవుతారని హెచ్చరించాడు. టీమిండియాకు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సేవలు అందుబాటులో లేకపోవడం మరింత మైనస్‌ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ మైండ్‌ సెట్‌ గతేడాదితో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని, ఇప్పుడు స్టోక్స్‌ టీమ్‌ ఎదురుదాడినే ప్రధాన అస్త్రంగా వినియోగిస్తుందని తెలిపాడు. అంతిమంగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టే ఫేవరెట్‌ అని జోస్యం చెప్పాడు. 

కాగా, గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ రేపటి నుంచి జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో (4 మ్యాచ్‌లు) ఉండగా సిరీస్‌ ఫలితంగా తేలకుండా నిలిచిపోయింది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 3-1తో, డ్రా చేసుకున్నా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే మాత్రం 2-2తో సిరీస్‌ డ్రా అవుతుంది. 
చదవండి: రోహిత్‌ దూరమైతే అతడిని కెప్టెన్‌గా నియమించవద్దు: పాక్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు